
- జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశం
- సికింద్రాబాద్ జోన్ పరిధిలో అభివృద్ధి పనుల పరిశీలన
పద్మారావునగర్, వెలుగు: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ సోమవారం సికింద్రాబాద్ జోన్లో పర్యటించారు. జోనల్ కమిషనర్ రవికిరణ్ తో కలిసి తార్నాక, చిలకలగూడ, పాటి గడ్డ, రసూల్ పురా, ప్రకాశ్ నగర్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. తార్నాక జంక్షన్ ఐల్యాండ్ నిర్మాణ పనులు, గ్రీనరీ ఇంప్రూవ్మెంట్ పనుల పురోగతిని తెలుసుకున్నారు. చిలకలగూడ ఆర్యూబీ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు.
సీ అండ్ డీ వేస్ట్ తరలించని వారికి జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. రసూల్పురా ఫ్లైఓవర్ ప్రతిపాదిత స్థలాన్ని, అలైన్మెంట్ పనులను, ప్రకాశ్నగర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సమీపంలోని వాటర్ లాగింగ్ పాయింట్లను పరిశీలించారు. తక్షణమే పూడికతీత పనులు చేపట్టాలని ఆదేశించారు. పాటిగడ్డ రైల్వే ఓవర్ బ్రిడ్జి హెచ్ సిటీ ఫ్లైఓవర్ రోడ్డు విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను చేపట్టాలన్నారు.
ఆస్తిపన్ను కు సంబంధించి ఫీల్డ్ డేటా, జీఐఎస్ డేటా, స్కెచ్ ఆధారంగా పూర్తిస్థాయి నివేదికను ఒక వారం లోగా అందించాలని జోనల్, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. కమిషనర్వెంట డిప్యూటీ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇతర సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.